-ఊరు, వాడల్లో భారీగా వెలసిన బ్యానర్లు, కటౌట్లు
-పల్లె పల్లెలో కేక్ లు పంచి సంభరాలు
-సేవా కార్యక్రమాలతో అభిమానాన్ని చాటుకున్న నాయకులు, కార్యకర్తలు
పలమనేరు, జులై 02 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలను తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పండుగ వాతావరణం ఉట్టిపడింది. ప్రతి ఊరిలోనూ బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా పల్లె పల్లెలో భారీ కేక్లను కట్ చేసి, బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మహిళలకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. పట్టణ నాయకుల ఆధ్వర్యంలో మదనపల్లి రోడ్డులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న ఉపాధి కూలీలతో కలసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నాయకత్వంలో పలమనేరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని కొనియాడారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ప్రజల మనిషిగా, నిరంతరం ప్రజా సేవలో ఉండే తమ నాయకుడి వేడుకలను ఇలా సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమ నాయకుడికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు ఆకాంక్షించారు. అలాగే అమర్నాథ్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
