తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం సమీపంలోని వన్నెస్ క్యాంపస్-2లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జిల్లా ప్రశిక్షణ మహా అభియాన్ -2026 ఆదివారం ఘనంగా ప్రారంభమైంది.
జండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులకు తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేయడమే ఈ శిక్షణా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, నిష్ఠతో సేవ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అనంతరం నిర్వహించిన ఆరు శిక్షణా సెషన్లలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి రమేష్ నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.కె. బాజీ, శ్రీనివాసరాజు, నాగోతి హరికృష్ణ, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ అనిల్ తదితరులు పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు మునసుబ్రహ్మణ్యం, టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
