పలమనేరు, జులై 24 ( గరుడ ధాత్రి ) :
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘మెగా పీటీఎమ్ 4.0’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పలమనేరు పట్టణంలోని శ్రీ తీర్థం కృష్ణయ్య శెట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి, మున్సిపల్ కమిషనర్ కె. ఎల్. వర్మ, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆర్బీసీ కుట్టి, కార్యదర్శి గిరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రస్తుత ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధన అందించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని వివరించారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా మంచి నడవడిక, సమయపాలన, క్రమశిక్షణ వంటి ఉత్తమ విలువలను అలవర్చుకోవాలన్నారు. పిల్లలను సెల్ఫోన్లకు వీలైనంత దూరంగా ఉంచి, వారి చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారితో తగిన సమయం గడపాలని కోరారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కుటుంబం, ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు మరియు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే అంశంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. అనంతరం విద్యాభ్యాసంలో ప్రతిభ కనబరిచి ‘షైనింగ్ స్టార్’ అవార్డులు సాధించిన విద్యార్థులను ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కన్నయ్య, టీడీపీ నాయకులు డిష్ రమేష్, కిరణ్ కుమార్, సుదర్శన్ బాలాజీ, మురళి, భాస్కర్, మౌలా, అఫ్రోజ్, జగ్గా, లోకేష్ ఆచారి, శ్రీనివాసులు, మేదర వెంకటరమణ, యువరాజ్, చెన్నరాయప్ప, షకీల్, అధ్యాపకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
