ఆకతాయిల ఆగడాలు పెరుగుతున్నాయంటూ గ్రామస్తుల ఆందోళన
గరుడధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం అమాసరెడ్డి కండ్రిక గ్రామంలో ఇటీవల ఆకతాయిల ఆగడాలు పెరుగుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి తీవ్రతరం కావడంతో సత్యవేడు పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై గ్రామ సమీపంలోని బావుల వద్దకు చేరుకుని జలక్రీడల్లో పాల్గొంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే కొందరు యువకులు అక్కడే మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జీవాలను హింసించడం, బహిరంగంగా అల్లర్లు సృష్టించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటుండటంతో మహిళలు, రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు యుకలిప్టస్ తోటకు నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
