తార్పాలిన్ లేకుండా ఇసుక రవాణా.. ప్రమాదాలకు ఆహ్వానం
గరుడధాత్రి :
నాగలాపురం మండల కేంద్రంలో ఇసుక ట్రాక్టర్ల నిర్లక్ష్య రవాణా వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. పరివాహక ప్రాంతాల నుంచి రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపు జరుగుతున్నప్పటికీ, చాలా వాహనాలు తార్పాలిన్ కప్పకుండా రోడ్లపై సంచరిస్తున్నాయి.
దీంతో ట్రాక్టర్ల వెనుక వస్తున్న ద్విచక్ర వాహనదారుల కళ్లలో ఇసుక దూసుకెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. కొంతమంది రోడ్డుపై పడిపడి గాయాలతో ఆసుపత్రుల పాలవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలినడకన వెళ్లే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రధాన రహదారులపై ఇసుక ఎగిరిపడి దుమ్ముతో వాతావరణం కలుషితమవుతోందని ప్రజలు చెబుతున్నారు. ట్రాక్టర్ యాజమానులు భద్రతా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఇప్పటికైనా పోలీసులు, రవాణా శాఖ అధికారులు స్పందించి తార్పాలిన్ లేకుండా ఇసుక తరలించే ట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇసుక రవాణాలో భద్రతా నియమాలు తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతున్నారు.
