తేదీ 27-04-2026
జిల్లా రవాణా శాఖ కార్యాలయం, తిరుపతి
తిరుపతి జిల్లాలోని మోటార్ క్యాబ్లు, మ్యాక్సీ క్యాబ్లు, బస్సులు, లారీలు, ట్రాక్టర్-ట్రైలర్లు మరియు టిప్పర్ వాహన యజమానులకు తెలియజేయునది ఏమనగా, వాహనాలకు సంబంధించిన త్రైమాసిక పన్ను (Quarterly Tax)ను పెనాల్టీ లేకుండా ఈ నెల 31వ తేదీ లోపు చెల్లించుకొనే అవకాశం కల్పించబడినది. అందువల్ల వాహన యజమానులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని, గడువులోపు పన్నులు చెల్లించవలసిందిగా కోరడమైనది. పన్ను సకాలంలో చెల్లించలేకపోయిన వారి వాహనాలు తనిఖీల సమయంలో పట్టుబడిన పక్షంలో తదుపరి మే మాసము నుండి 100% పెనాల్టీ మరియు జూన్ మాసంలో 200% పెనాల్టీ విధించబడుతుందని ఈ సందర్భంగా జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలియచేశారు.
అలాగే, గతంలో రవాణా శాఖ అధికారులు వాహనాలపై నమోదు చేసిన తనిఖీ రసీదులకు సంబంధించిన అపరాధ రుసుములు (Compounding Fees) మరియు బకాయి పన్నులు ఉంటే, వాటిని కూడా తక్షణమే చెల్లించవలసిందిగా సూచించడమైనది.
గడువు తేదీ అనంతరం పన్నులు చెల్లించని వాహనాలపై, మోటార్ వాహన చట్టం ప్రకారం, రవాణా శాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు కఠిన చర్యలు తీసుకుని, అవసరమైతే వాహనాలను స్వాధీనం (Seizure) చేసుకునే అవకాశం ఉన్నదని హెచ్చరించడమైనది.
ప్రతి వాహన యజమాని తన వాహనానికి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ (Fitness), ఇన్సూరెన్స్ (Insurance), పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC), పన్ను (Tax) వంటి అన్ని పత్రాలను చెల్లుబాటు (Validity)లో ఉంచుకోవడం తప్పనిసరి.
వాహనం నడిపే డ్రైవర్ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం మరియు మోటార్ వాహన చట్టంలోని అన్ని నియమ నిబంధనలను పాటించడం ద్వారా రోడ్డు భద్రతకు సహకరించవలసిందిగా సూచించడమైనది.
రహదారి భద్రత దృష్ట్యా, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి.
కొర్రపాటి మురళీమోహన్
జిల్లా రవాణా అధికారి
తిరుపతి జిల్లా
