నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయంలో వార్షిక మహోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం చక్రస్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. కోనేరు వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, చక్రాయుధానికి సుగంధ ద్రవ్యాలు, పాలు, పెరుగు, తేనె తదితర పవిత్ర ద్రవ్యాలతో తిరుమంజనం చేశారు.
అనంతరం కోనేటి జలాలకు సంప్రోక్షణ చేసి భక్తిశ్రద్ధల నడుమ చక్రస్నానం నిర్వహించారు. ఈ పవిత్ర ఘట్టాన్ని దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కోనేటిలో స్నానమాచరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణలతో మార్మోగిపోయాయి.
