-ఎస్సీ కాలనీ బోరుబావికి సొంత భూమి విరాళం
-ఎంపీపీ నిధులతో ఎస్సీ కాలనీలో బోరుబావి ఏర్పాటు
– స్థలం దానం చేసిన మాజీ సర్పంచ్ కేబీ కిరణ్ కుమార్.. హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
పిచ్చాటూరు జూన్ 08 గరుడధాత్రి :
గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఒక ప్రజాప్రతినిధి తన ఉదారతను చాటుకున్నారు. పిచ్చాటూరు మండలం అడవి కోడియం బేడు పరిధిలో ఎస్సీ కాలనీ నివాసితుల తాగునీటి సమస్య పరిష్కారానికి మాజీ సర్పంచ్ కేబీ కిరణ్ కుమార్ తన సొంత పట్టా భూమిని దానంగా ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఎస్సీ కాలనీలో చాలా కాలంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. స్థానికుల ఇబ్బందులను గమనించిన అధికారులు, నాయకులు ఎంపీపీ నిధుల ద్వారా ఇక్కడ ఒక నూతన బోరుబావిని మంజూరు చేయించారు.
అయితే బోరుబావి వేయడానికి తగిన ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో పనులు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో మాజీ సర్పంచ్ కేబీ కిరణ్ కుమార్ స్పందించి.. కాలనీ ప్రజల కోసం తన సొంత పట్టా భూమి నుంచి కొంత స్థలాన్ని దానంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
ఆయన ఇచ్చిన సొంత స్థలంలోనే సోమవారం బోరుబావి తవ్వకం పనులను కేబీ భాస్కర్ నాయుడు, కండ్ర ప్రకాష్, వెంకటేష్ నాయుడు, కేబీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తి చేశారు.
బోరుబావి నుంచి నీరు సమృద్ధిగా పడటంతో కాలనీ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తమ కాలనీ ప్రజల దాహార్తిని తీర్చడం కోసం రూపాయి ఆశించకుండా తన సొంత పట్టా భూమిని దానం చేసిన మాజీ సర్పంచ్ కేబీ కిరణ్ కుమార్ కి, అలాగే నిధులు మంజూరు చేయించిన ఎంపీపీ కి ఎస్సీ కాలనీ వాసులు, మహిళలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
