మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారి ఆధ్వర్యంలో వేడుకలు
శాస్త్రోక్తంగా ప్రత్యేక* పూజలువేద పఠనం
విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు
గరుడదాత్రి న్యూస్ మైదుకూరు, జూలై 26:
శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మాస కల్యాణ మహోత్సవం ఆదివారం మఠ ప్రాంగణంలో అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారి దివ్య ఆశీస్సులతో, వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు.
ఉదయం నుంచే వేద పండితులు, దేవస్థానం పూజారులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి మాస కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ సాగిన ఈ పూజా కార్యక్రమాల్లో మఠాధిపతుల వారి సోదరులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ మహోత్సవంలో మాస కల్యాణ ఉభయదాతలు, మఠం సిబ్బంది పరిపూర్ణాచార్యులు, గోపాల చారి, సుబ్బరాయుడుతో పాటు స్థానిక, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులందరికీ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
