నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి సత్యవేడు వాస్తవ్యులు, దేవస్థాన పాలకమండలి సభ్యులు శ్రీ ఎస్. కృష్ణయ్య గారు రూ.50,000 విరాళంగా అందజేశారు.
ఈ విరాళాన్ని చెక్కు రూపంలో సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి పి. లత గారికి, ఆలయ చైర్మన్ శ్రీ డి. పద్మనాభరాజు గారికి అందించారు.
ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ, తాను ఇటీవల దేవస్థానాన్ని సందర్శించి స్వామివారి దర్శనం అనంతరం అన్నదానంలో పాల్గొన్నానని తెలిపారు. భక్తులకు అందిస్తున్న అన్నదానం నాణ్యంగా, ఆదర్శవంతంగా ఉందని కొనియాడారు. దేవస్థానానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ఇదే విధంగా నాణ్యమైన ప్రసాదాలు, సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు పలువురు భక్తులు పాల్గొన్నారు.
