కుప్పం,ఆగస్టు 09 (గరుడ ధాత్రి న్యూస్):
ప్రకాశం బ్యారేజ్ లో గోదారమ్మ నీటి పరవళ్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పట్టి సీమ ద్వారా కృష్ణమ్మకు వస్తున్న గోదావరి నీటిని ముఖ్యమంత్రి తిలకించారు. ఆదివారం విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళుతున్న సమయంలో బ్యారేజ్ పై కొద్దిసేపు తన వాహన కాన్వాయ్ నిలిపిన ముఖ్యమంత్రి గోదావరి నీటితో నిండు కుండలా ఉన్న బ్యారేజ్ ను పరిశీలించారు. గోదావరి నీటితో బ్యారేజ్ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్ లో ఇప్పటి వరకు 17.52 టిఎంసిల నీటిని కృష్ణా నదికి తరలించినట్లు అధికారులు వివరించారు.
