తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మోపురుపల్లి గ్రామంలోని బ్లూ స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శ్రీ సిటీ పోలీసులు మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. “మీ భద్రత మా బాధ్యత” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం మహిళా ఉద్యోగుల్లో చైతన్యాన్ని కలిగించింది.
ఈ కార్యక్రమంలో శ్రీ సిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బీవీ శ్రీనివాసులు, శ్రీ సిటీ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి ఎం. ప్రియాంక పాల్గొని మహిళల భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాల్య వివాహాలు, పోక్సో చట్టం, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
డీఎస్పీ బీవీ శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళలు ఏవైనా వేధింపులకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. డైల్ 100, 112, శక్తి యాప్ వినియోగంపై వివరించారు. అలాగే ఉద్యోగ స్థలాల్లో జరిగే వేధింపులపై కంపెనీ యాజమాన్యానికి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.
ఎస్ఐ శ్రీమతి ఎం. ప్రియాంక మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న నేరాలు, వాటికి సంబంధించిన శిక్షలు, సైబర్ మోసాలపై జాగ్రత్తలు వివరించారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని సూచించారు. మహిళలు మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలని, హింసకు వ్యతిరేకంగా స్వరం వినిపించాలని తెలిపారు.
ఈ సమావేశంలో రోడ్డు భద్రత, డ్రగ్స్ మరియు గంజాయి నివారణ, సైబర్ హెల్ప్లైన్ 1930, మహిళా హెల్ప్లైన్ 181 తదితర అంశాలపై కూడా ఉద్యోగులకు అవగాహన కల్పించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు కంపెనీ యాజమాన్యం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.
