పిచ్చాటూరు, జూన్ 8 గరుడధాత్రి : టాటా ట్రస్ట్స్ సహకారంతో విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిచ్చాటూరు మండలంలోని ఎంఆర్సీ (MRC) భవనంలో కుక్ కమ్ హెల్పర్స్కు బలవర్ధక ఆహారం (ఫోర్టిఫైడ్ ఫుడ్స్)పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోషకాహారం ప్రాముఖ్యత, ఫోర్టిఫైడ్ ఆహార పదార్థాల వినియోగం, వాటి ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన వంటకాలను తయారుచేసే విధానాలను వివరించారు. అలాగే ఫోర్టిఫైడ్ బియ్యం, ధాన్యాలు, నూనె, పాలు వంటి ఆహార పదార్థాలను గుర్తించే విధానం, వాటిని సరైన పద్ధతిలో వినియోగించడం ద్వారా పోషక విలువలు కాపాడుకునే అంశాలను తెలియజేశారు.
విటమిన్-ఏ, ఐరన్, ఫోలిక్ యాసిడ్, అయోడిన్, విటమిన్-డి వంటి సూక్ష్మ పోషకాల ప్రాధాన్యతను వివరించి, రక్తహీనత నివారణ, కంటి ఆరోగ్యం, ఎముకల బలం, శారీరక ఎదుగుదలకు వాటి పాత్రను వివరించారు.
విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అసోసియేట్ జె. రామకృష్ణ శిక్షణను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మహమ్మద్ రఫీ, ఎంఈఓ-1 హేమమాలిని, ఎంఈఓ-2 యోగంధర్ రాజు, సీఆర్పీలు, ఉపాధ్యాయులు, కుక్ కమ్ హెల్పర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంలో కుక్ కమ్ హెల్పర్స్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారికి భోజన వసతి కల్పించారు.
