జూన్ 25 నుంచి జూలై 3 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవ వైభవానికి ముస్తాబవుతున్న అప్పలాయగుంట
భక్తులందరికీ మరపురాని ఆధ్యాత్మిక అనుభూతి కల్పించాలి – జేఈవో డా. ఎ. శరత్
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను జూన్ 25 నుండి జూలై 3 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం ఆలయ పరిసరాలు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆలయ సమీపంలోని కల్యాణ మండపంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల వైభవాన్ని భక్తులకు చేరవేసేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పరిసర గ్రామాల్లో ధర్మరథం ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఎస్వీబీసీ ద్వారా బ్రహ్మోత్సవాల ప్రత్యేక ప్రోమోలు ప్రసారం చేయాలన్నారు.
-భక్తులకు సౌకర్యాలే ప్రథమ ప్రాధాన్యం
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, మజ్జిగ, ప్రసాదాల పంపిణీతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా జూన్ 28న కల్యాణోత్సవం, జూన్ 29న గరుడసేవ, జూలై 2న రథోత్సవం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
-పరిశుభ్రత, భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు
విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించాలని జేఈవో సూచించారు.
-విద్యుత్, పుష్పాలంకరణలతో దివ్య శోభ
ఆలయ పరిసరాలను విద్యుద్దీపాలు, పుష్పాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
-భక్తులను అలరించనున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు
అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత కళాశాల, హెచ్డీపీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
-బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ
జూన్ 24న అంకురార్పణ, జూన్ 25న ధ్వజారోహణం, జూలై 3న చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను జేఈవో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సూర్య కుమారాచార్యులు, డెప్యూటీ ఈవో శ్రీ హరింధ్రనాథ్, శ్రీ సెల్వం, విజీవో శ్రీ గిరిధర్, ఎస్ఈ శ్రీ నరసింహమూర్తి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, సీఎంవో డా. కుసుమకుమారి, ఏఈవో శ్రీ దేవరాజులు తదితర అధికారులు పాల్గొన్నారు.
