కడపలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు ” పోస్టర్ ఆవిష్కరణ.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ ఆగ్రహం….
గరుడధాత్రి :
వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం మరియు కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్ బాషా నివాస కార్యాలయంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ను సీఈసీ సభ్యుడు ఎవరు కె.సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి ఎస్ఈసి సభ్యులు మాసిమా బాబు వైఎస్సార్సీపీ నాయకులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ‘సూపర్ సిక్స్’ పేరుతో ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని, మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగులు ప్రభుత్వ విధానాలతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు అని విమర్శించారు.
రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, విద్యుత్ ఛార్జీలు, ఇంధన ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడిందని పేర్కొన్నారు. ధరల పెరుగుదలతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుండగా, ప్రభుత్వం మాత్రం ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు ప్రస్తుతం అమలు చేస్తున్న పాలనకు ఎలాంటి పొంతన లేదని నాయకులు వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల అమలులో జాప్యం, అభివృద్ధి పనుల్లో మందగమనం, ఉద్యోగ అవకాశాల కల్పనలో నిర్లక్ష్యం కారణంగా అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు మాజీ కోఆప్షన్ సభ్యులు డివిజన్ ఇన్చార్జీలు జిల్లా మరియు నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు ముఖ్య నాయకులు, మహిళ నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.
