*24 గంటల త్రీ-ఫేజ్ విద్యుత్తో గ్రామాల్లో అభివృద్ధికి కొత్త దిశ
వ్యవసాయం,కుటీర పరిశ్రమలకు ఊతం
*నియోజకవర్గంలో 137 కోట్లతో ఆధునీకరణ పనులు
*సూర్య ఘర్ పథకంతో విద్యుత్ ఆదాతో పాటు అదనపు ఆదాయానికి అవకాశం
పలమనేరు, జులై 29 ( గరుడ ధాత్రి ) :
గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్డీఎస్ఎస్ (Revamped Distribution Sector Scheme) పథకం వరంలాంటిదని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అన్నారు. పెద్దపంజాణి మండలంలోని లింగాపురం, ముత్తుకూరు, కరసనపల్లి, మాదనపల్లి పంచాయతీలలో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం మూడో రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ప్రజలను కలుసుకుని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా ముత్తుకూరు పంచాయతీలో విద్యుత్ ఫీడర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, పలమనేరు నియోజకవర్గంలో రూ.137 కోట్ల వ్యయంతో ఆర్డీఎస్ఎస్ పథకం అమలు అవుతోందని తెలిపారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో కొత్త విద్యుత్ స్తంభాలు, లైన్ల విస్తరణ, నూతన ఫీడర్ల ఏర్పాటు వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
ఈ పనులు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీంతో రైతులు వ్యవసాయ అవసరాలకు నిరంతర విద్యుత్ పొందడమే కాకుండా, గ్రామాల్లో కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు మరింత విస్తరిస్తాయని వివరించారు. గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరిగి, గ్రామాల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్య ఘర్ పథకం ద్వారా సబ్సిడీతో సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోందని తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబాలు విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవడంతో పాటు, అదనంగా ఉత్పత్తి చేసే విద్యుత్ను గ్రిడ్కు విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చని ఎమ్మెల్యే వివరించారు.
ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని తీసుకొస్తున్న ఇలాంటి పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఈఈలు సురేష్, భాస్కర్ నాయుడు, డీఈ జీవన్ కుమార్ రెడ్డి, ఏఈలు వెంకటరమణ, వసంత రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
