గరుడధాత్రి :
సత్యవేడు బాలికల పాఠశాల విద్యార్థినులకు ప్రోత్సాహ బహుమతులు అందజేసిన “వీ టూ హెల్ప్ యు” స్వచ్ఛంద సంస్థ
సత్యవేడు స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు హైదరాబాద్కు చెందిన “వీ టూ హెల్ప్ యు” నాన్-గవర్నమెంట్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సాఫ్ట్వేర్ ఉద్యోగి బాలచంద్రారెడ్డి చేతుల మీదుగా టాపర్లకు ఈ పురస్కారాలను బహూకరించారు.పదో తరగతిలో 582 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిన డి. నివేదాకు రూ.10,000, 494 మార్కులతో ద్వితీయ స్థానం సాధించిన వి. రమ్యకు రూ.7,500, అలాగే 487 మార్కులతో తృతీయ స్థానం పొందిన కే. భార్గవికి రూ.5,000 నగదు బహుమతిగా అందించారు.
-మంచి స్నేహాలతోనే ఉన్నత గుర్తింపు
ఈ సందర్భంగా ముఖ్య అతిథి బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరి వ్యక్తిగత, విద్యాపరమైన అభివృద్ధి వారు ఎంచుకునే స్నేహితులపైనే ఆధారపడి ఉంటుంది. విద్యార్థులు ఎప్పుడూ మంచి, తెలివైన వారితో స్నేహం చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలి” అని ఆకాంక్షించారు.
-ప్రణాళికాబద్ధమైన చదువుతోనే విజయం
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. భారతి మాట్లాడుతూ.. బాలికలు చదువుతో పాటు సంస్కారవంతంగా ఎదగాలని, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికాబద్ధమైన చదువు, మంచి పుస్తకాల పఠనం ద్వారానే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు. పదో తరగతి ఉపాధ్యాయురాలు వి.వాణి మాట్లాడుతూ.. రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థినులు మరింత కష్టపడి 500కు పైగా మార్కులు సాధించేలా ఇప్పటి నుంచే శ్రమించాలని ప్రోత్సహించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థినులను ప్రోత్సహిస్తూ నగదు బహుమతులు అందజేసినందుకు “వీ టూ హెల్ప్ యు” సంస్థకు పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ పాఠశాల విద్యార్థులకు ఇలాగే సహకారం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సురేఖ, సుగుణ, ఢిల్లీ రాణి మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
