పిచ్చాటూరులో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహణ
పిచ్చాటూరు, మే 24 గరుడధాత్రి :
పిచ్చాటూరు మండల ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు మే 25వ తేదీ సోమవారం పిచ్చాటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తహశీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అందజేసే ప్రతి ఫిర్యాదుకు అధికారిక రశీదు (అక్నాలెడ్జ్మెంట్) ఇవ్వబడుతుందని తెలిపారు. నిర్ణీత గడువులో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించేందుకు ఈ రశీదు ఉపయోగపడుతుందని వివరించారు.
మండల స్థాయిలో పరిష్కరించగల సమస్యల కోసం ప్రజలు ముందుగా ఎంపీడీఓ కార్యాలయాన్ని సంప్రదించాలని, జిల్లా కలెక్టర్ స్థాయిలో మాత్రమే పరిష్కారం అయ్యే అంశాల కోసం తిరుపతి కలెక్టరేట్ను ఆశ్రయించాలని తహశీల్దార్ సూచించారు.
“పిచ్చాటూరు మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలి. మండల స్థాయి అధికారుల సమక్షంలో ఫిర్యాదులు నమోదు చేసి త్వరితగతిన పరిష్కారం అందించేలా కృషి చేస్తాము” అని తహశీల్దార్ చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
