కుప్పం,సెప్టెంబర్ 14 (గరుడ ధాత్రి న్యూస్):
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను సోమవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి ప్రతిమ వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని గణనాథుడికి వేద మంత్రోచ్ఛారణల నడుమ తొలిపూజ నిర్వహించారు. స్వామివారికి పత్రి, పూలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విఘ్నాలు తొలగించే వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నేతలు ప్రార్థించారు.
