సత్యవేడు, జూన్ 4 గరుడధాత్రి : సత్యవేడు పట్టణంలోని కోటమిట్ట ప్రాంతంలో పేదలకు కేటాయించిన భూముల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 19 సెంట్ల భూమికి సంబంధించిన పేదల పట్టా భూమికి న్యాయం చేయాలని బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ, సమస్యకు పరిష్కారం కనిపించడం లేదని వాపోతున్నారు.
ఈ భూములు ప్రభుత్వ భూములుగా ఉండి, పేదలకు పట్టాలు మంజూరు చేసినప్పటికీ ప్రస్తుతం ఆక్రమణలకు గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఈ భూముల క్రయవిక్రయాలు కూడా జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమ నిర్మాణాలు రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నాయని, రెవెన్యూ అధికారుల దృష్టికి రాకుండా పనులు నిర్వహిస్తున్నారని ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. గురువారం రాత్రి గోడల నిర్మాణం చేపట్టి, వాటిపై రేకులు వేస్తున్న పనులు జరిగినట్లు తెలిపారు.
“పేదల భూముల్లో రాత్రివేళల్లో నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఎక్కడున్నారు? ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరు?” అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదలకు కేటాయించిన భూములను పరిరక్షించి, అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
