ఆశా వర్కర్లకు నిర్బంధ సబ్సెంటర్ డ్యూటీలు రద్దు చేయాలి: ఐఎఫ్టీయూ డిమాండ్
గరుడధాత్రి న్యూస్ :
ఆశా వర్కర్లపై నిర్బంధంగా విధిస్తున్న సబ్సెంటర్ డ్యూటీలను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక నాగలాపురం ధర్మరాజుల గుడి ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినట్లు యూనియన్ అధ్యక్షురాలు జి.గీత ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు దేశాండి అరుణాచలం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బాలింతలు, పసిపిల్లలు మరియు సామాన్య ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఆశా వర్కర్లు స్వచ్ఛందంగా నిరంతరం సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం వారికి కనీస వేతనాలు కూడా అందించకుండా మోసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సబ్సెంటర్లలో నిర్బంధంగా డ్యూటీలు చేయించడం వల్ల గ్రామాల్లో బాధితులకు సమయానికి అందుబాటులో ఉండలేకపోతున్నారని, గర్భిణులను సకాలంలో ఆసుపత్రులకు తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అదనంగా సబ్సెంటర్ డ్యూటీలకు ప్రత్యేక వేతనం కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని విమర్శించారు.
మరో జిల్లా నాయకుడు మురుగేషన్ మాట్లాడుతూ ఆశా వర్కర్లను ఎన్సీడీసీ సర్వేలకు వినియోగించరాదని, వ్యాక్సిన్ బాక్సులు మోయించే పనులు అప్పగించవద్దని అన్నారు.
అనంతరం నాగలాపురం ధర్మరాజు గుడి సెంటర్ వద్ద నిర్వహించిన సమావేశంలో 12 మంది ఆశా వర్కర్లతో నూతన ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల ఆశా వర్కర్ల సమాఖ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్గా జె.లతాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకుడు దక్షిణామూర్తి, ఆశా వర్కర్లు గీత, మునిలక్ష్మి, రూతు, లతా, కిరుభ, జయ, కోకిల, ధన, మీనా తదితరులు పాల్గొన్నారు.
