గృహహింస నిరోధక చట్టం మహిళల రక్షణ కోసమే – ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి
గరుడధాత్రి న్యూస్ : మహిళల రక్షణ, భద్రత కోసం గృహహింస నిరోధక చట్టం అమల్లోకి తీసుకువచ్చినట్లు తిరుపతి జిల్లా సత్యవేడు ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కోటమిట్ట అంగన్వాడీ కేంద్రంలో కిషోర్ వికాసంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2005 సంవత్సరం నుంచి గృహహింస నిరోధక చట్టం అమల్లో ఉందని, దీని ద్వారా మహిళలకు న్యాయపరమైన రక్షణతో పాటు ఉపశమనం కూడా లభిస్తుందని వివరించారు. భాగస్వామ్య కుటుంబంలో నివసించే మహిళను శారీరకంగా, మానసికంగా, లైంగికంగా లేదా ఆర్థికంగా వేధించడం గృహహింస కిందకు వస్తుందని తెలిపారు.
అదనపు కట్నం, ఆస్తి కోసం వేధింపులు చేయడం కూడా ఈ చట్ట పరిధిలోకే వస్తుందని పేర్కొన్నారు. వివాహ బంధం, రక్త సంబంధం లేదా ఒకే ఇంట్లో కలిసి జీవించే మహిళలందరికీ ఈ చట్టం రక్షణ కల్పిస్తుందని చెప్పారు. వేధింపుల కారణంగా మహిళను ఇంటి నుంచి బలవంతంగా పంపించివేయడానికి వీల్లేదని, అవసరమైతే ఆమెకు ప్రత్యేక నివాసం కల్పించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వగలదని తెలిపారు.
అలాగే వైద్య ఖర్చులు, రోజువారీ అవసరాల కోసం భర్త లేదా ప్రత్యర్థి పక్షం నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశం కూడా ఈ చట్టం ద్వారా ఉంటుందని చెప్పారు. గృహహింసకు గురయ్యే మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్ లేదా మహిళా హెల్ప్లైన్ 1091ను సంప్రదించాలని సూచించారు.
ఈ సందర్భంగా నిర్బంధ విద్య హక్కు చట్టంపై కూడా అవగాహన కల్పించారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కిషోర్ బాలబాలికలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
