పిచ్చాటూరు జూలై 24 గరుడధాత్రి :
పిచ్చాటూరు మండలం వేలూరు ఎంపీపీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం లో టీడీపీ తిరుపతి పార్లమెంటరీ మాజీ ఉపాధ్యక్షులు, తెదేపా సీనియర్ నాయకులు కే. సతీష్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఒకే లక్ష్యంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల చదువుతో పాటు వారి నడవడి, క్రమశిక్షణ, ప్రతిభపై కూడా తల్లిదండ్రులు నిరంతరం దృష్టి సారించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా సదుపాయాలను విద్యార్థులు పూర్తిగా వినియోగించుకోవాలని, ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారి ప్రతిభను వెలికితీయాలని కోరారు. మంచి విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానాన్ని సాధించవచ్చని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తల్లిదండ్రులు తరచూ పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో పిల్లల విద్యా ప్రగతిపై చర్చించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిర్వహిస్తున్న ఇటువంటి సమావేశాలు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
