* గరుడదాత్రి న్యూస్ మైదుకూరు జులై 20*:-వర్షాలు సమృద్ధిగా కురిసి పట్టణం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు
* 102 కలశాలతో మహిళల చే గుడి చుట్టూ ప్రదక్షిణ ఘనంగా శివాభిషేకం, అన్నదానం
మైదుకూరు పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు వర్ధిల్లాలనే సంకల్పంతో పట్టణంలో వెలసియున్న ప్రముఖ దేవస్థానం శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి దేవస్థానంలో సోమవారం ‘వరుణ యాగం’ అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే పరమశివునికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
యాగంలో భాగంగా 102 మంది మహిళలు సాంప్రదాయ దుస్తులతో శిరస్సున జల కలశాలను ధరించి, ఆలయ ప్రాంగణం చుట్టూ మంగళవాయిద్యాల నడుమ గుడి చుట్టూ ప్రదక్షిణగా నిర్వహించారు. అనంతరం ఆ పుణ్యతీర్థ జలాలతో పరమశివునికి మహా రుద్రాభిషేకం గావించారు.
ఘనంగా హోమం నిర్వహించారు
అభిషేకానంతరం వేదపండితుల మంత్రోచ్చారణలు, హోమoలో ఆహుతుల నడుమ శాస్త్రోక్తంగా వరుణ యాగాన్ని పూర్తి చేశారు. ఈ యాగం అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులకు, విచ్చేసిన ప్రజలందరికీ ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి దేవస్థాన చైర్మన్ బెల్లం సుబ్బరాయుడు, ఆలయ డైరెక్టర్ కరమాలపుటి శేషయ్య పాల్గొని పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. వారితో పాటు పట్టణానికి చెందిన భక్తులు, మహిళలు, ఆధ్యాత్మిక వేత్తలు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
