గరుడ దాద్రి న్యూస్ మైదుకూరు జులై 20:
వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని మార్తోమా నగర్లో ఉన్న 3 సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించి బద్వేలుకు చెందిన పిన్నం వెంకటయ్య మరియు ప్రొద్దుటూరుకు చెందిన అయ్యవారమ్మ తదితరుల మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో, 18.07.2026 తేదీ సాయంత్రం పిన్నం వెంకటయ్యకు మరియు సదరు స్థలాన్ని అయ్యవారమ్మ వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పబడుతున్న కడపకు చెందిన బొజ్జా తిరుమలేష్ తదితరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
సంఘటన సమాచారం అందుకున్న వెంటనే బద్వేలు టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, ఇరు వర్గాలను అక్కడి నుండి పంపించి శాంతిభద్రతలను పునరుద్ధరించారు.
ఈ ఘటనకు సంబంధించి బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం.106/2026, సెక్షన్ 194(2) BNS కింద కేసు నమోదు చేయబడింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే వాస్తవాల ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
అయితే, ఈ భూ వివాదానికి సంబంధించిన సంఘటనను వక్రీకరిస్తూ, ఒక మహిళ రవిక (జాకెట్) చించి ఆమెను అవమానించినట్లు కొన్ని ప్రసార మాధ్యమాలు, ముఖ్యంగా ఒక టెలివిజన్ ఛానల్, అలాగే సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రసారం చేయడం జరిగింది.
పోలీసుల విచారణ మేరకు పై ఘటన లోని మహిళ దుస్తులు చింపడం గానీ, ఎలాంటి అవమానకరమైన చర్య గానీ జరగలేదు. ఈ ప్రచారము నిరాధారం మరియు వాస్తవాలకు విరుద్దమైనది.
భూ సంబంధిత వివాదాన్ని వక్రీకరించి, మహిళ గౌరవానికి భంగం కలిగించినట్లు తప్పుడు ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో అనవసర అపోహలు, విద్వేషాలు నెలకొనే అవకాశం ఉంది. ఇటువంటి అసత్య, కల్పిత, రెచ్చగొట్టే కథనాలను ప్రసారం చేయడం లేదా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం చట్టరీత్యా శిక్షార్హమైన చర్య అని మైదుకూరు డి.ఎస్.పి శ్రీ జి. రాజేంద్ర ప్రసాద్ గారు హెచ్చరించారు.
ప్రజలు, మీడియా ప్రతినిధులు ఎలాంటి సమాచారాన్నైనా సంబంధిత అధికారుల ద్వారా ధృవీకరించుకున్న తర్వాత ప్రచారం చేయాలని, నిరాధార వార్తలను విశ్వసించకుండా, వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
