పలమనేరు, జులై 21 ( గరుడ ధాత్రి ) :
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పలమనేరు పట్టణంలో అక్రమ గుట్కా, పాన్ మసాలా వ్యాపారాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలమనేరు అర్బన్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు లోకేష్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బందితో కలిసి మంగళవారం పట్టణంలోని పలు షాపులు, కిరాణా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పట్టణంలోని కొన్ని దుకాణాల్లో అక్రమంగా గుట్కా, పాన్ పరాగ్, హాన్స్, కూల్లిప్ వంటి నిషేధించబడిన పదార్థాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈ సోదాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం నిషేధించిన గుట్కా, పాన్ మసాలా, కూల్లిప్ వంటి ప్రాణాంతక పదార్థాలను ఎవరైనా విక్రయిస్తే ఉపేక్షించేది లేదు. షాపు యజమానులు ఇటువంటి అమ్మకాలకు దూరంగా ఉండాలి. నిబంధనలను ఉల్లంఘించి నిషేధిత పదార్థాలను విక్రయిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని పోలీసులు స్పష్టం చేశారు.
