తిరుపతి, జూలై 20 గరుడధాత్రి : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ఏపీఎస్ ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత ఉపయోగకరంగా నిర్వహించాలని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. సోమవారం తిరుపతిలోని ఏపీఎస్ ఆర్టీసీ రీజినల్ కార్యాలయంలో రీజినల్ మేనేజర్ జగదీష్ కు నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు కీలక డిమాండ్లను ఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. సత్యవేడు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను విస్తరించాలని, నాగలాపురం ఆర్టీసీ బస్టాండ్ను ఆధునీకరించి అవసరమైన పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.
అదేవిధంగా, రాత్రి 9 గంటల తర్వాత సత్యవేడు ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక రాత్రి సర్వీసులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, సత్యవేడు డిపో నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి వరకు నేరుగా ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆర్ఎం ను కోరారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత త్వరగా ఈ ప్రతిపాదనలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆర్ఎం జగదీష్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
